తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది.
సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుండి దాదాపు 13 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచారు.
గురువారం ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం ఉదయం 11.16 గంటలకు ముగిసింది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు.
ఈ సందర్భంగా తిరుప్పావై, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ధనుర్మాస కైంకర్యాలు, ఇతర నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది.
అన్నప్రసాద వితరణ ప్రారంభం
సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరిచారు.
వంటశాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.
టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ మనోహర్, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply