తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు.
అనంతరం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది.
ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.
అక్కడినుండి కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా పద్మపుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించారు.
ఆభరణంతో కూడిన శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్కుమార్కు అందజేశారు. పసుపు మండపం వద్ద ఈవోకు తిరుపతి జెఈవో అందించారు.
Leave a Reply