
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం ఉదయం కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కంద మూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు.
ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు.
భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది.
అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చాడు.
అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీసోమస్కంద మూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
సింహ వాహనం :
ఆదివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు.
భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు.
మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు.
Leave a Reply