పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం గోదా కల్యాణం వైభవంగా జరిగింది.
పవిత్రమైన ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 243 కేంద్రాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచనాలు, ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు నిర్వహించారు.
ముందుగా గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి గోదాదేవి(ఆండాళ్), రంగనాథస్వామివారి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు.
వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.
టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17వ తేదీ నుండి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం ముగిశాయి.
తిరుపతికి చెందిన చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఇన్ చార్జి ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply