
ఐఏఎస్ అంటే సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అవగాహాన ఉండాలి. పట్టు ఉండాలి. శిక్షణ పొందుతున్న ఐఏఎస్లకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శిక్షణ లేదా అవగాహన కల్పించడం ఏంటి?
అదేగా మీ అనుమానం. అవును నిజమే అక్కడేం శిక్షణ ఉంటుంది. అనిపిస్తుంది. ఇందులో తప్పేం లేదు.
కానీ మీకు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటాయో దాదాపుగా అన్ని శాఖలు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఉంటాయి.
ఇక్కడ కనీసం ముగ్గురు ఐఏఎస్ అధికారులు లేదా ఆ స్థాయిలో ఉన్న అధికారులు అలాగే ఐపిఎస్ స్థాయి అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే సీనియర్ మోస్ట్ అధికారి కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. అందుకే రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న అధికారులకు ఓ రోజు ఇక్కడ కూడా అవగాహనా కార్యక్రమాన్ని కల్పిస్తారు.
ఇక్కడ జరిగే వ్యవహరాలను వారికి వివరిస్తారు. అందులో భాగంగానే కొందరు ట్రైనీ ఐఏఎస్ లకు టీటీడీలో అవగాహన కల్గించారు.
టిటిడి కార్యకలాపాలపై 20 మంది శిక్షణ ఐఏఎస్లకు తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో అవగాహన కల్పించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్య శాలలు, విద్యాసంస్థల గురించి వివరించారు.
టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, దివ్యదర్శనం టైంస్లాట్, ఆన్లైన్ సేవలు, పారిశుధ్యం, శ్రీవారి సేవ కార్యకలాపాలను తెలిపారు.
అదేవిధంగా టిటిడి స్థానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు.
టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, వేద విద్యవ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు వివరించారు.
తరువాత వారు అన్నప్రసాదం కాంప్లెక్స్, లడ్డూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట కాంప్లెక్స్ సందర్శించి ఆయా ప్రాంతాలలో కార్యకలాపాలను అధ్యయనం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో మరియు లైజన్ అధికారి డా..రమణప్రసాద్, సెట్విన్ సిఈవో మరియు ప్రభుత్వ లైజన్ అధికారి శ్రీ మురళికృష్ణ,
క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ పేష్కార్ శ్రీ లోకనాథం, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Leave a Reply