టిటిడి వెబ్సైట్లో “యేసయ్య” అనే పదం రావడం వెనుక తమ సంస్థ తప్పులేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
అది గూగుల్ అనువాదంలో వచ్చిందని చెప్పుకొచ్చారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు.
టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతోందని కొందరు వ్యక్తులు పని గట్టుకుని చేస్తున్న ప్రచారమని అన్నారు. వేంకటేశ్వరస్వామివారి జోలికి వస్తున్న ఇలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు.
గూగుల్ సెర్చింజన్లో “టిటిడి వికారినామ సంవత్సర పంచాంగం 2019-20” అని టైప్ చేస్తే అందులో “శ్రీ యేసయ్య” అనే పదం ఆ డిస్ప్లేలో శనివారం కనిపించిందన్నారు.
టిటిడి పంచాంగం మొదటి పేజీలో తెలుగులో “శ్రియై నమః” అనే పదం కనిపిస్తుందని, దీన్ని గూగుల్ ఇంటర్ప్రిటర్లో తీసుకున్నపుడు హెచ్టిఎంఎల్ క్యాషెలో “శ్రీ యేసయ్య”గా మార్పు చెంది ఉండవచ్చన్నారు.
గూగుల్ ఇంటర్ప్రిటర్లో తర్జుమా అయ్యే పదాలు పిడిఎఫ్ ఇమేజ్, బార్డర్ పరిమాణం, ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, అక్షరాల మధ్య స్పేస్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఇది గూగుల్ ఇంటర్ప్రిటర్ సమస్యే గానీ, టిటిడి పంచాంగంలో దొర్లిన తప్పు కాదని తెలియజేశారు.
ఈ సమస్యను అధిగమించడానికి గాను ఈ విషయాన్ని శనివారం గూగుల్కు రిపోర్టు చేసి వివరణ కోరామన్నారు. అ తరువాత గూగుల్ క్యాషెలో అప్డేట్ అవడానికి 12 గంటలు పట్టిందని, ఆ తరువాత ఆ పదం కనిపించలేదని ఛైర్మన్ తెలిపారు.
టిటిడి వెబ్సైట్ను బయట నుండి ఎవరూ హ్యాక్ చేయడం గానీ, టిటిడి ఇన్హౌస్లో ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం అయినట్టుగానీ ఐటి టెక్నికల్ టీమ్ విచారణలో తెలియలేదన్నారు. ఇది కేవలం గూగుల్ ఇంటర్ప్రిటర్ సమస్యగానే గుర్తించామని తెలిపారు.
Leave a Reply