
ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ
పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఉదయం 8.00 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు.
కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
అయితే సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 17వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 2.00 గంటల నడుమ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవంతుని సమక్షంలో భక్తులు కూడ సహపంక్తి భోజనం చేయడం విశేషం.
అవసరమైన చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేసింది. అదేవిధంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, అన్నప్రసాదాలు పంపీణి చేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
Leave a Reply